తిరుపతిలో గెలుపు కోసమే వరుస దాడులా!!
ఎంపీ దుర్గ ప్రసాద్ మరణంతో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో జరగనున్న ఈ ఎన్నికల కోసం అన్నీ పార్టీలు సిద్ధమయ్యాయి. మాజీ ఎంపీ పనబాక లక్ష్మిని టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. వైసీపీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా డాక్టర్ గురుమూర్తి ముందు వరుసలో ఉన్నారు. బీజేపీ-జనసేన కూటమి మాత్రం ఇప్పటివరకు తమ అభ్యర్థి ఎవరో తేల్చలేదు. 2019లో జరిగిన ఎన్నికలలో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలతో వైసీపీ రాష్ట్రంలో ఘనవిజయం సాధించింది. దీంతో ప్రతిపక్షాలు చాలా రోజులు సైలెంట్ గా ఉన్నారు. ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టే అవకాశం ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు తిరుపతి ఉప ఎన్నిక ఓ ఆశాకిరణంలా కనబడింది. దీంతో ఈ ఉప ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలే విధ్వంస రచన చేశారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన తిరుపతిలో అధికార వైసీపీకి మంచి పట్టు ఉంది. ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతే కాకుండా వరుస సంక్షేమ పథకాలతో అన్నీ వర్గాలకు లబ్ది చేకూరడంతో వైసీపీకి తిరుపతిలో మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో వైసీపీ సునాయాసంగా గెలుస్తోందని సర్వేలు తేల్చిచెప్పాయి. అసలే దారుణమైన పరాజయంతో భవిష్యత్తుపై అనుమానాలు నెలకొన్న ప్రతిపక్షాలు 'దేవాలయాలపై దాడులు' అనే అంశాన్ని తమ ప్రధాన ఆయుధంగా వాడుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. మత రాజకీయాలు చేసి అధికారం పీఠం దక్కించుకోవడం బీజేపీకి అలవాటే. ఇది కొత్త విషయమేమి కాదు. కానీ కొత్తగా దేశంలోనే తానే అనుభవజ్ఞడనే చెప్పుకునే చంద్రబాబు కూడా దీనిని రాజకీయ కోణంలోనే చూస్తుండటం గమనార్హం.