భార్గవ్‌రామ్ ఎక్కడ.. పోలీసుల గాలింపు




హైదరాబాద్‌లో వందల కోట్ల విలువైన భూవ్యవహారంలో కిడ్నాప్‌కు తెరలేపిన సంఘటనలో ఏపీ టీడీపీ నేత భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏ3గా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటన జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్న అతడి కోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. గర్భంతో ఉన్న భార్య జైల్లో ఉన్నా సరే అతడు మాత్రం బయటకు రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, భార్గవ్ రామ్‌కు గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగుళూరులో ఉండే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే భార్గవ్ రామ్ కాల్ డేటాను విశ్లేషించేపనిలో పడ్డారు. మరోవైపు అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతుకుతున్నారు. అతడి వ్యాపార భాగస్వాములపైనా నిఘా ఉంచారు. ఇక ప్రవీణ్ రావు కిడ్నాప్ కేసులో కీలక నిందితుడు గుంటూరు శ్రీను ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కిడ్నాప్ తర్వాత నిందితులు వికారాబాద్ మీదుగా మహారాష్ట్రవైపు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దాదాపు 15 మంది సభ్యులు గల ఈ ముఠా కలిసే పారిపోయారా లేదా విడివిడిగా ఎటైనా వెళ్లారా అనేదానిపై అనుమానాలు నెలకొని ఉన్నాయి.


Latest News
more

Trending
more